జాతరకు జీరో టికెట్ లేనట్లే..?
స్పెషల్ బస్సుల ఏర్పాటుకు ఆర్టీసీ కసరత్తు
(వాయిస్ ఆఫ్ భారత్ న్యూస్) గిరిజనుల కుంభమేళ, మేడారం మహా జాతరకు తరలి వెళ్లనున్న ఆర్టీసీ ప్రయాణికులకు చార్జీల మోత మోగనుంది. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్ బస్సులనే నడుపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు ప్రచారం సాగుతోంది. తద్వారా మహాలక్ష్మి పథకం ద్వారం బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని దూరం చేసేందుకు వ్యూహం రచించినట్లు సమాచారం. జనవరిలో సంక్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క-సారలమ్మ జాతల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే నష్టం తప్పదనే ఆలోచనతో ప్రభుత్వం పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ల స్థానంలో ప్రత్యేక బస్సులను నడిపించి చార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీని ఆదేశిం చినట్టు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం అమలులో ఆర్టీసీ అధికారులకు రోజుకో కొత్త అనుభవం ఎదురవుతోంది. బస్సుల్లో ఉచిత ప్రయాణం కార్యక్రమం అమలుకు ముందు నిత్యం రూ.11 కోట్ల నుంచి రూ. 18 కోట్ల ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో ఆక్యుపెన్సీ పెరిగినా, ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో రోజూ సంస్థకు రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు నష్టం వస్తోంది. ప్రభుత్వం ఇస్తామని చెప్తున్న రీయింబర్స్మెంట్ చెల్లించే వరకూ ఈ భారాన్ని ఆర్టీసీ భరించాల్సి ఉన్నది. ఇదే జరిగితే లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే ఆర్టీసీ నిండా మునిగే ప్రమాద ముంది. ఈ నేపథ్యంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోందన్న ప్రచారం సాగుతోంది. పల్లెవెలుగు, ఆర్టీసీ బస్సులను తగ్గించి పూర్తిస్థాయిలో స్పెషల్ బస్సులను నడిపించాలని ఆర్టీసీని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి ఆర్టీసీ అధికారులతో చర్చించినట్టు తెలిసింది. స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉండదని భావిస్తున్నట్టు సమాచారం.
