ఆస్కార్ వేడుకకు రంగం సిద్దం
15న సాయంత్రం ప్రత్యక్ష ప్రసారం
ముస్తాబైన డాల్బీ థియేటర్
ప్రెజెంటర్గా ప్రియాంక చోప్రా
ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారాలుగా భావించే ‘ఆస్కార్స్ 2026’ (98వ అకాడమీ అవార్డ్స్) వేడుకకు రంగం సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఉన్న ప్రఖ్యాత డాల్బీ థియేటర్ ఈ అద్భుత దృశ్యకావ్యానికి వేదిక కానుంది. 2025లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గౌరవిస్తూ అందించే ఈ పురస్కారాల కోసం హాలీవుడ్ తారలంతా ఒకే చోట చేరనున్నారు.
వాయిస్ ఆఫ్ వందే భారత్, లాస్ ఏంజిల్స్ :
ప్రియాంక చోప్రా సందడి..
ఈ ఏడాది ఆస్కార్ వేదికపై భారతీయ నటి ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఆమె ఈ వేడుకలో ప్రెజెంటర్గా వ్యవహరించడం విశేషం. హాలీవుడ్ దిగ్గజాలు రాబర్ట్ డౌనీ జూనియర్, అన్నే హాత్వే, గ్వినేత్ పాలిట్రో వంటి ప్రముఖులతో కలిసి ఆమె విజేతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.ప్రముఖ హాస్యనటుడు, టెలివిజన్ హోస్ట్ కోనన్ ఓబ్రియన్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్కార్ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఆయన చమత్కారంతో కూడిన వ్యాఖ్యానం ఈ వేడుకకు అదనపు హంగులు అద్దనుంది. అమెరికా కాలమానం ప్రకారం మార్చి 15 ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది. కాల వ్యత్యాసం కారణంగా భారతీయ ప్రేక్షకులు మార్చి 16 (సోమవారం) తెల్లవారుజామున 4:30 గంటల నుంచి స్టార్ మూవీస్ (ఉదయం లైవ్, రాత్రి పునః ప్రసారం) లో, జియో హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తారల తళుకులతో కూడిన ‘రెడ్ కార్పెట్’ ఈవెంట్తో మొదలై, అవార్డుల ప్రదానోత్సవం వరకు ఈ వేడుక కనువిందు చేయనుంది. ఏ చిత్రం ఉత్తమంగా నిలుస్తుంది? ఏ నటుడు ఆస్కార్ను ముద్దాడుతాడు? అన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
