దేశాభివృద్ధిలో పోస్టల్ ఉద్యోగుల పాత్ర కీలకం/The role of postal employees is crucial in the development of the country
పోస్టల్ ఉద్యోగులకూ 78 రోజుల దసరా బోనస్ ప్రకటించాలి
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : దేశాభివృద్ధిలో పోస్టల్ ఉద్యోగుల పాత్ర కీలకమని, వారికి కూడా 78 రోజుల దసరా బోనస్ను ప్రకటించాలని అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్ ‘సి’ రాష్ట్ర అధ్యక్షుడు ఉకంటి మహేందర్ డిమాండ్ చేశారు. దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 4.5 లక్షల మందికి పైగా పోస్టల్ ఉద్యోగులు ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్ బీ) కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో, క్షేత్ర స్థాయిలో వాటిని విజయవంతంగా అమలు చేయడంలో పోస్టల్ ఉద్యోగులు ముందున్నారని మహేందర్ పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో సైతం గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతర ఆర్థిక సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల రైల్వే ఉద్యోగులకు ప్రకటించిన విధంగానే పోస్టల్ ఉద్యోగులకు కూడా 78 రోజుల బోనస్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక, కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పటివరకు కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్) ప్రకటించకపోవడం శోచనీయమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే డీఏ, డీఆర్ ప్రకటించి, జూలై నెల నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను చెల్లించాలని ఉకంటి మహేందర్ కోరారు.
