DHAVAN/సోఫీ ఖాన్ తో ధావన్ చెట్టా పట్టాల్
వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక ప్రతినిధి : భారత క్రికెట్ మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా ఓ యువతితో కనిపించి వార్తల్లో నిలిచాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ధావన్, భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్కు హాజరయ్యాడు. భారత క్రికెటర్లను కలిసి, వారిని ఉత్సాహపరుస్తూ మైదానంలో గడిపాడు. అనంతరం వీఐపీ బాక్స్ నుంచి మ్యాచ్ వీక్షించాడు. అయితే, అతనితో ఓ విదేశీ యువతి కనిపించడం ఆసక్తికరంగా మారింది. ధావన్ గతంలోనూ ఆమెతో పలుమార్లు కనిపించాడని సమాచారం. ఐర్లాండ్కు చెందిన సోఫీ ఖాన్ అనే యువతి ధావన్ సరసన కనిపించినట్లు తెలుస్తోంది. అయితే, వీరిద్దరి సంబంధంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 39 ఏళ్ల ధావన్ ఇప్పటికే వివాహితుడు, అయితే అతను తన భార్య ఆయేషా ముఖర్జీకి విడాకులు ఇచ్చాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాతో ధావన్ వివాహ బంధం పెట్టుకున్నా, కొన్నాళ్లకు విడిపోయారు. వీరికి జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. ఆయేషాకు ఇది రెండో వివాహం కాగా, ఆమెకు మునుపటి భర్తతో ఇద్దరు కుమార్తెలున్నారు. విడాకుల అనంతరం తన కుమారుడిని కలుసుకోలేకపోతున్న బాధను ధావన్ సోషల్ మీడియాలో పలుమార్లు వ్యక్తం చేశాడు. ఇప్పుడీ నేపథ్యంలో సోఫీతో ధావన్ బహిరంగంగా కనిపించడంతో అభిమానులు ఆసక్తిగా చర్చిస్తున్నారు.
టోర్నీలో భారత్ ప్రదర్శన..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మూడోసారి విజేతగా నిలవాలని భావించిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడడంతో టోర్నీకి దూరమయ్యాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా బుమ్రా నిలుస్తాడని ధావన్ ప్రశంసించాడు. అతని గైర్హాజరీ భారత జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ అవకాశాన్ని యువ బౌలర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్లను టీమిండియాలోకి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్తో తొలి వన్డే సిరీస్లో అరంగేట్రం చేసిన హర్షిత్ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో అతడికి మెగా టోర్నీలో అవకాశం దక్కింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో హర్షిత్ మూడు వికెట్లతో రాణించాడు. అతడి ఆటలోని ఆత్మవిశ్వాసం, వికెట్లు తీసే సామర్థ్యాన్ని ధావన్ ప్రత్యేకంగా ప్రశంసించాడు.
భారత్ – పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్ …
మెగా టోర్నీలో బంగ్లాదేశ్పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ ఆదివారం దుబాయ్ వేదికగా తలపడనుంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారీ పరాజయం మూటగట్టుకున్న పాకిస్థాన్ ఒత్తిడిలో ఉంది. భారత్ చేతిలో ఓడితే, టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.
