సంత్ సేవాలాల్ చూపిన మార్గం అనుసరణీయం
- అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి
- రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
వాయిస్ ఆఫ్ భారత్ (లోకల్ న్యూస్): సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ వారి 285 జయంతి ముగింపు వేడుకలు ఘానంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సంత్ సేవాలాల్ జయంతి పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ 18వ శతాబ్దంలోనే అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కర్తగా పని చేశారని అన్నారు. ఆయన పరమపదించి దాదాపు రెండు వందల సంవత్సరాలు దాటినా కూడా సేవాలాల్ మహారాజ్ ను దైవంగా భావిస్తున్నారంటే ఆయన చేసిన బోధనలు, అనుసరించిన మార్గం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. అహింసా మార్గాన్ని అవలంబించాలని, అనర్ధాలకు కారణమయ్యే మద్యపానానికి దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని సేవాలాల్ చేసిన బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు సేవాలాల్ మహారాజ్ గొప్పతనం గురించి, ఆయన చేసిన బోధనలు భవిష్యత్ తరానికి సైతం అందేలా కృషి చేయాల్సిన బాధ్యతను గుర్తెరిగి ముందుకు సాగాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా జిల్లా లో సేవాలాల్ మహరాజ్ భవన నిర్మాణం కోసం గతంలో కేటాయించిన స్థల పరిశీలన చేసి 15 రోజులలో శంకుస్థాపన చేయించుట కు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ బంజారా జాతి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి 22 సూత్రాలను అందించారని అన్నారు. భాష వేషము కట్టుబొట్టు మన సాంప్రదాయాలు, మన పద్ధతులు కూడా కాపాడుకుంటేనే మనం పలానా ట్రైబల్ ఒక లంబాడిగా గుర్తిపు ఉంటుందని అన్నారు. ఏదైనా మారాలంటే మననుండే మారాలని, దానికోసం వారు చూపిన బాటలో నడవాలని అన్నారు. సామాజికంగా గిరిజనులు ఇంకా ఎదగాలన్నారు.
సేవాలాల్ మహరాజ్ చెప్పిన విధంగా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. మాజీ ఎంపీ సీతారం నాయక్ మాట్లాడుతూ, చదువు వలననే ఏ జాతి అయినా బాగుపడుతుందని, చదువు, ఆరోగ్యం మీద శ్రద్ధ కనబరచాలని, అభివృద్ధి చెందిన వారు మిగతా వారి ఉన్నతికి పాటుపడాలని, మనం ఏం చేయాలన్న వారి స్ఫూర్తి తీసుకొవాలన్నారు. జిల్లాలో గిరిజన అధికారులు సామాజిక అభివృద్ధి అంశాలలో చొరవ తీసుకోవాలని, సంత్ సేవాలాల్ చూపిన ఆశయాలను అందరి సహకారంతో సాధించాలని, గిరిజన జాతి అభ్యున్నతికి పాటుపడాలని అన్నారు. మాజీ గ్రంధాలయ చేర్మెన్ పోరిక గోవిందనాయక్ మాట్లాడుతూ, బంజారా జాతి సేవాలాల్ చూపిన విధంగా ఏకతాటిపై ఉండాలని, మద్య మాంసాలకు దూరంగా ఉండాలని, ఆయన ఆశయాలను సాధించి బంజారా సంస్కృతిని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్, డీడీ పోషం, డీఎస్పీ రవీందర్, బంజారా ముఖ్య స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
