రాముడు అందరి వాడు
- ప్రజల అభీష్టం మేరకే బాలక్ రామ్ ప్రతిష్ఠాపన
- ప్రతిపక్షాల ఆరోపణలు సిగ్గు చేటు
- తెలంగాణలో 10 లోకసభ సీట్లు గెలుస్తాం..
- అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి
వాయిస్ ఆఫ్ భారత్, (కల్చరల్ న్యూస్): రాముడిపై బీజేపీ రాజకీయాలు చేస్తుందనేది అవగాహన లేని వాళ్లు చేస్తున్న ఆరోపణలని అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. దేశాయిపేట్ రోడ్డులోని కేఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం అయోధ్య శ్రీ బాల రామ్ మందిర్ దర్శన్ అభియాన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అయోధ్య రామాలయం దేశ ప్రజలందరికీ చెందుతుందన్నారు. రాముడంటే సత్యానికి, ధర్మానికి, విశ్వాసానికి నిదర్శనమన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజలంతా దర్శనం చేసుకుంటున్నారన్నారు. ప్రతిపక్షాలు రాముడిపై రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ ఎప్పుడు ప్రజల మనసెరిగి పని చేస్తుందని గుర్తు చేశారు. హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్ నైజమని ఆరోపించారు. ప్రజలంతా రాముడి దర్శనం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 10 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. మోడీ దేశ రక్షణ కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే మోడీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, సంక్షేమం ప్రతీ ఇంటికి చేరుతుందన్నారు. మోడీ అందిస్తున్న పాలనకు తెలంగాణ ప్రజలు సైతం ఆకర్షితులవుతున్నారని, దీనికి నిదర్శనం అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు. మొదటిసారి జిల్లాకు వచ్చిన అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి గంట రవికుమార్ భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్, వన్నాల వెంకటరమణ, గడల కుమార్ యాదవ్, పొట్టి శ్రీనివాస్ గుప్తా, బండి సాంబయ్య యాదవ్, మల్లాడి తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్ మరియు పదాధికారులు పాల్గొన్నారు.
