(వాయిస్ ఆఫ్ భారత్, పొలిటికల్) ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. శుక్రవారం జీడబ్ల్యు ఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, సంబంధిత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 12 వ డివిజన్ దేశాయిపేటలోని షాది ఖానా, 19వ డివిజన్ వీవర్స్ సెక్షన్ కాలనీ, కాశీబుగ్గ, 36వ డివిజన్ చింతల్ లోని జమాతే ఇస్లామీ హింద్ భవనం, 34 వ డివిజన్ లోని భూపేష్ నగర్, శివనగర్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రజా పాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను మంత్రి సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది స్వీకరిస్తున్న దరఖాస్తుల తీరును పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఇప్పటివరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 90శాతం దరఖాస్తు స్వీకరించామన్నారు. క్రమ పద్ధతిలో ప్రజలకు ప్రజాపాలన దరఖాస్తులు అందుతున్నాయని, ప్రభుత్వ అధికారులు తోడ్డాటు అభినందనీయమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు పాలకుల లాగా కాకుండా సేవకులు వలే పని చేస్తున్నారన్నారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. నిరుపేదలకు మధ్యతరగతి వారికి కావలసిన కనీస అవసరాలు తీర్చాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారని, ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమం మన జిల్లాలో పగడ్బందీగా కొనసాగుతుందన్నారు. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో నియోజక వర్గ ప్రత్యేక అధికారి కృష్ణా రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.