పాలకుర్తి రోడ్లకు రూ.21 కోట్ల నిధులు/Rs. 21 crore funds for Palakurthi roads
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ
వాయిస్ ఆఫ్ భారత్, తొర్రూరు: పాలకుర్తి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి రూ. 21 కోట్లు మంజూరు చేస్తానని మైనారిటీల సంక్షేమ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు. పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి సోమవారం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ విషయమై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఆప్యాయతతో పలకరించారు. తర్వాత, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గంలోని తండాలు, గూడాలలో ఉన్న రహదారుల దయనీయ పరిస్థితిని మంత్రికి వివరించారు. గత పది సంవత్సరాలుగా రోడ్లను ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె వాపోయారు. రహదారుల మరమ్మతులకు తక్షణమే నిధులు కేటాయించాలని మంత్రిని ఆమె అభ్యర్థించారు. ఎమ్మెల్యే అభ్యర్థనను ఆలకించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెంటనే స్పందించి, రూ. 21 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి ప్రజల తరపున మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల మంజూరుతో తండాలు, గూడాలకు సౌకర్యవంతమైన రోడ్లు ఏర్పడి, ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని ఆమె పేర్కొన్నారు. నిధుల మంజూరు వార్త వెలువడగానే పాలకుర్తి నియోజకవర్గ ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది.

