నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. జాతీయ పసుపు బోర్డు చైర్ పర్సన్గా నిజామాబాద్కు చెందిన పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు.
అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నేతగా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2025, జనవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. నిజామాబాద్లో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్స తేదీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. 2025, జనవరి 14వ తేదీన ఉదయం 10 గంటలకు నిజామబాద్లోని నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్స కార్యక్రమం జరగనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ ఇచ్చిన మేరకు పసుపు బోర్డు కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాదులోనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్కువ విస్తీర్ణంలో పసుపును పండించే తమ రాష్ట్రంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడిని తెచ్చినా ఇచ్చిన మాట కోసం నిజామాబాదులోనే బోర్డ్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం అనౌన్స్ చేసింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. స్థానిక బీజేపీ ఎంపీ అర్వింద్ సక్సెస్ అయ్యారని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు రానుండడంతో ప్రపంచ పసుపు హబ్గా నిజామాబాద్ మారనుంది.
