చిన్న వ్యాపారుల కోసం ‘పిల్లొ ఏఐ’
ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరణ
వాయిస్ ఆఫ్ భారత్, అమరావతి : సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడంలో ఎప్పుడూ ముందుండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశంలోనే తొలిసారిగా చిన్న, మధ్యతరహా వ్యాపారాల (MSME) కోసం రూపొందించిన వాయిస్-ఆధారిత అకౌంటింగ్ ఏఐ ఏజెంట్ ‘పిల్లొ ఏఐ’ను సోమవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం స్వయంగా వాయిస్ కమాండ్ ద్వారా మొదటి ఇన్వాయిస్ను రూపొందించి, ఈ టెక్నాలజీ పనితీరును ప్రదర్శించారు. ఈ యాప్ ద్వారా వ్యాపారులు క్లిష్టమైన సాఫ్ట్వేర్ అవసరం లేకుండా, తమ సొంత మాతృభాషలో మాట్లాడటం ద్వారా బిల్లులు తయారు చేయడం, లావాదేవీలు నమోదు చేయడం మరియు వ్యాపార నివేదికలను పొందవచ్చు. అకౌంటింగ్పై అవగాహన లేని వారు కూడా సులభంగా తమ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకునేలా దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “చిన్న వ్యాపారాలు డిజిటల్గా ఎదిగేందుకు ఇలాంటి ఏఐ సాధనాలు ఎంతో అవసరం. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా, రాష్ట్రంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మరింత బలోపేతం చేస్తుంది” అని అన్నారు. పిల్లొ ఏఐ వ్యవస్థాపకుడు సాయి ప్రణీత్ జి, సహ వ్యవస్థాపకుడు రామ్ మోహన్ లోచర్లా మాట్లాడుతూ.. ఖరీదైన సిస్టమ్లు కొనే శక్తి లేని లక్షలాది మంది చిన్న వ్యాపారులకు ఈ వాయిస్ అకౌంటింగ్ ఒక విప్లవాత్మక మార్పు అని తెలిపారు. స్క్రీన్లు, పేపర్వర్క్ అవసరం లేకుండా కేవలం సంభాషణతోనే వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎస్ విజయానంద్ (IAS), ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ముత్తవరపు సురేష్, పిల్లొ ఏఐ పెట్టుబడిదారులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
