కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాల్సిందే

కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాల్సిందే
#@@@Congress must implement election promises@@@

బీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్

వాయిస్ ఆఫ్ భారత్, హుజురాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ మహిళా నాయకురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హుజురాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయిందని ప్రభావతి రెడ్డి విమర్శించారు. “నాటి ఎన్నికల సందర్భంగా పంటల బీమా అమలు చేస్తామని, అందులో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఊదరగొట్టి… నేడు రెండు సీజన్లు గడిచినా పంటల బీమా ఊసే కాంగ్రెస్ సర్కార్ ఎత్తడం లేదు. అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వక, ఇటు పంటల బీమా పైసలు రాక రైతన్నను అరిగోస పెడుతున్న రైతు ద్రోహి రేవంత్” అని ఆమె ఆరోపించారు. కేసీఆర్ పాలనతో పోలిక, ప్రస్తుత పథకాల నిలిపివేతకేసీఆర్ పదేళ్ల పాలనలో సాగునీరు, తాగునీరు, విద్యుత్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారని ఆమె గుర్తు చేశారు. నిరుపేద, మధ్యతరగతి ప్రజల కోసం, రైతుల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల పాఠశాలలు, దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ఎన్నో పథకాలు అమలు చేశారని వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదని, సంక్షేమ పథకాల అమలు నిలిచిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విశ్వసనీయత దెబ్బతింటోందని ఆరోపణ..
“రాష్ట్రం దివాళా తీసిందని, అప్పు పుట్టడం లేదని, తాము ఏమి చేయలేమని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. రాష్ట్ర ప్రజల మానసిక స్థైర్యాన్ని, రాష్ట్ర విశ్వసనీయతను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోంది” అని ప్రభావతి రెడ్డి ఆరోపించారు. దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధోగతిపాలు చేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని ప్రజలు చెప్తున్నారని ఆమె అన్నారు. ఏడాది కాలం కాకముందే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

హామీలపై దృష్టి పెట్టాలి, రిజర్వేషన్లు అమలు చేయాలి..
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ నేతలను ప్రతినిత్యం విమర్శించడం మానుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని ఆమె సవాల్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసి కార్పొరేషన్ పదవులను మహిళలకు కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మహిళలకు మంత్రిమండలిలో, కార్పొరేట్ పదవులలో తగిన ప్రాధాన్యత కల్పించి కాంగ్రెస్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభావతి రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *