ఆన్ లైన్ లోనే అమ్మల మొక్కులు..

ఆన్ లైన్ లోనే అమ్మల మొక్కులు..
  • నిలువెత్తు బంగారం సమర్పించేలా యాప్
  • ప్రారంభించిన మంత్రి సురేఖ

వాయిస్ ఆఫ్ భారత్, (కల్చరల్ న్యూస్):  తెలంగాణ సమాజం మహిమాన్విత శక్తులుగా కొలిచే శ్రీ సమ్మక్క సారక్కల జాతరకు వెళ్ళలేని భక్తులు ఇంటినుంచే తమ నిలువెత్తు బంగారాన్ని ఇంటినుంచే సమర్పించేలా ఏర్పాటు చేసిన ఆన్ లైన్ సేవలను బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సురేఖ ప్రారంభించారు. తన మనవడు కొండా మురళీకృష్ణ పేరును మీ సేవ వెబ్సైట్ లో నమోదు చేసి, బరువు ప్రకారం డబ్బులు చెల్లించి అమ్మవారి గద్దెల వద్ద నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సౌకర్యాన్ని మంత్రి సురేఖ పొందారు. వివిధ కారణాలతో సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోలేని భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఐటి శాఖ సహకారంతో దేవాదాయ శాఖ అమలు చేస్తున్న ఈ సేవలు బుధవారం నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు. మీ సేవ (ఆన్లైన్, ఆఫ్ లైన్), టి-యాప్ ఫోలియో (ఆన్లైన్), పోస్టల్ డిపార్ట్మెంట్ల (ఆఫ్ లైన్) ద్వారా ఎవరి పేరు మీదైతే బంగారం సమర్పించాలనుకుంటున్నారో వారి బరువును అనుసరించి డబ్బులు చెల్లించేలా దేవాదాయ శాఖ వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలోని దాదాపు 5 వేల మీ సేవా సెంటర్లు, దేశంలోని దాదాపు 1.5 లక్షల పోస్టల్ కేంద్రాలు (తెలంగాణలో 6 వేల కేంద్రాలు) ఈ సేవలను అందిస్తాయన్నారు. దేవాదాయ శాఖ సంవత్సరం పొడవునా బంగారం సమర్పణ సేవలను అందిస్తుందని మంత్రి ప్రకటించారు. బంగారం సమర్పణతో పాటు, అమ్మవారి ప్రసాదం కావాలనుకునే వారు కూడా పోస్టల్ డిపార్ట్ మెంట్, టి-యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా డబ్బులు చెల్లించినట్లైతే, పోస్టల్ డిపార్ట్ మెంట్ కొరియర్ ద్వారా వారికి ప్రసాదాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పలువురు దేవాదాయ శాఖ అధికారులు, పోస్టల్ డిపార్ట్ మెంట్, మీ సేవ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *