ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక అండ కల్యాణలక్ష్మి /Kalyanalakshmi provides financial support for girls’ marriages
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
వాయిస్ ఆఫ్ భారత్, పాలకుర్తి (సెప్టెంబర్ 10): పాలకుర్తి మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ చెక్కులను స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. మొత్తం రూ. 56,06,496 విలువైన ఈ చెక్కులను ఆమె తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక అండ లభిస్తోందని, ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అభ్యున్నతే తమ ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎల్లప్పుడూ ముందుండి కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, అధికారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చెక్కులు అందుకున్న కుటుంబాలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
పాలకుర్తి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యలపై శాసనసభ్యురాలుయశస్విని రెడ్డి మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. పాలకుర్తి మండలం, మేకల తండాకు చెందిన బాధవత్ తిరుపతి ఇటీవల అనారోగ్యానికి గురై ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా, ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించారు. తిరుపతి చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రెండు లక్షల రూపాయలు (ఎల్.ఓ.సి) మంజూరయ్యేలా కృషి చేశారు. దీంతో తిరుపతి గారికి మెరుగైన వైద్యం పొందే అవకాశం లభించింది. ఎమ్మెల్యే సహాయానికి ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

