బాధితులకు బాసటగా భరోసా కేంద్రం
- వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలబాలికలకు భరోసా కేంద్రం ఆసరాగా నిలుస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో ఉమేన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని రాష్ట్ర పోలీస్ డీజీపీ రవి గుప్తాతో అడిషనల్ డీజీపీలు షికా గొయల్, మహేష్ భగత్ తో కలిసి వర్చవల్ గా ప్రారంభించారు. అనంతరం సీపీ జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, డీసీపీ సీతారాంతో కలిసి శిలా ఫలాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ లైంగిక దాడులకు గురైన బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే భాదితులకు న్యాయపరమైన సహకారంతో పాటు వైద్య, ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. వీటితో పాటు బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో లీగల్, మెడికల్ సిబ్బందితో పాటు ఇతర సహాయ సిబ్బందికి సంబందించి పూర్తిగా మహిళలు విధులు నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండా బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతాయని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, జనార్దన్ రెడ్డి, కృష్ణతో పాటు వెస్ట్ జోన్ కు చెందిన ఇన్స్ స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్లు, ఎసైలు, భరోసా కేంద్రం సిబ్బంది, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
