గృహ‘లక్ష్మి’ ఇవ్వండి
- బిల్లులు మంజూరు చేయాలి
- కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే చల్లా వినతి
(వాయిస్ ఆఫ్ భారత్ న్యూస్) గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకంలో భాగంగా పరకాల నియోజకవర్గంలో నూతనంగా ఇండ్లు నిర్మాణం చేపట్టిన మూడు వేల మంది లబ్ధిదారులకు వెంటనే బిల్లులు మంజూరు చేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారెంటీల్లోని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో మొదటి ప్రాధాన్యంగా గృహలక్ష్మి లబ్ధిదారులను చేర్చి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం అందించాలన్నారు. గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షల ఆర్ధిక సహాయం అందుతుందన్న ఉద్దేశంతో లబ్దిదారులంతా పాత గృహాలను కూల్చేసి నూతన ఇండ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటిని అధికారులు నేరుగా పరిశీలించి మంజూరు పత్రాలు అందచేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే గృహలక్ష్మి పథకం రద్దు చేసినట్లు ఉత్తర్వులు విడుదల చేశారన్నారు. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటిస్తే ప్రస్తుతం పురోగతిలో ఉన్న ఇండ్ల లబ్ధిదారులు రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు లేని నిరుపేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని చల్లా ధర్మారెడ్డి కోరారు.
